Erragadda Hospital: హైదరాబాద్ ఎర్రగడ్డలోని మానసిక ఆరోగ్య కేంద్రం మరోసారి వార్తల్లోకెక్కింది. సోమవారం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆసుపత్రిలో ప్రత్యేక భోజనం అందజేసిన నేపథ్యంలో కలుషిత ఆహారం కారణంగా పెద్ద ఎత్తున రోగులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనలో భూపాలపల్లికి చెందిన కరణ్ (30) అనే వ్యక్తి మంగళవారం ఉదయం చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరో 92 మంది రోగులు వాంతులు, విరేచనాలు, జ్వరం వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. వారిలో 18 మందిని మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మిగిలిన బాధితులు ప్రస్తుతం స్థిరమైన పరిస్థితిలో ఉన్నారని వైద్యులు వెల్లడించారు.
ప్రత్యేక ఆవిర్భావ భోజనంలో చక్కెర పరమాన్నం, అన్నం, కూర, అరటి పండ్లు, గుడ్లను వడ్డించారు. అయితే ఆహారం తిన్న కొద్దిసేపటికే డిశ్చార్జి కమిటీ (డీసీ) వార్డు, కోర్టు వార్డుల్లో 71 మంది రోగులకు తలనొప్పి, వాంతులు మొదలయ్యాయి. వెంటనే వైద్య సిబ్బంది స్పందించి ప్రాథమిక చికిత్స అందించారు. అయితే డీసీ వార్డులో ఉన్న కరణ్ పరిస్థితి విషమంగా మారి మృతి చెందాడు.
ఇది కూడా చదవండి: Ambati Rambabu: అంబటి రాంబాబుకు బిగ్ షాక్.. కేసు నమోదు
ఈ ఘటనపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఆహార సరఫరా కాంట్రాక్టర్ జైపాల్రెడ్డిని తక్షణమే తొలగించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అనిత ఆదేశాలు జారీ చేశారు. అలాగే బాధ్యతారాహిత్యం ప్రదర్శించిన ఆర్ఎంవో డాక్టర్ పద్మజను సస్పెండ్ చేశారు. ఆసుపత్రిలో ఉన్న తాగునీటి సరఫరా పద్ధతులపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నల్లా నీటిని ఆర్వో ప్లాంట్ ద్వారా శుద్ధించి రోగులకు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఆ నీరు వాడుతున్న స్టీలు బిందెల్లో మలినత కనిపించిందని రోగుల ఆరోపణ. తాగునీరు కాలుష్యం వల్లా ఈ ఘటన చోటుచేసిందా అనే కోణంలోనూ విచారణ జరుగుతోంది.
ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న ఆహార నమూనాలను, తాగునీటి నమూనాలను పరీక్షల కోసం ల్యాబ్కు పంపినట్లు డాక్టర్ అనిత తెలిపారు. ఉస్మానియా వైద్యుల ప్రత్యేక బృందం ఎర్రగడ్డ ఆసుపత్రిని సందర్శించి పరిస్థితిని సమీక్షిస్తోంది. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కూడా ఈ అంశంపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.